jaipal reddy: రైతులకు కంటకప్రాయుడు.. కాంట్రాక్టర్లకు ప్రియుడు: కేసీఆర్ పై జైపాల్ రెడ్డి ఫైర్

  • ప్రాజెక్టులన్నీ ఆంధ్ర కాంట్రాక్టర్ల చేతిలో పెడుతున్నారు
  • సచివాలయానికి వెళ్లని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్
  • మైనార్టీలను మోసం చేసేందుకే.. ముందస్తుకు వెళ్లారు

ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కాంట్రాక్టుల పేరిట ప్రజాధనాన్ని కేసీఆర్ లూటీ చేస్తున్నారని విమర్శించారు. రైతులకు కంటకప్రాయుడు, కాంట్రాక్టర్లకు ప్రియుడు కేసీఆర్ అని గతంలోనే తాను చెప్పానని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నింటినీ ఆంధ్ర కాంట్రాక్టర్ల చేతిలో పెడుతున్నారని మండిపడ్డారు.

సచివాలయానికి రాకుండా పాలించిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ మాత్రమేనని జైపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇలాంటి ముఖ్యమంత్రిని తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని చెప్పారు. ప్రభుత్వ విధానాలపై తాను చేస్తున్న ఆరోపణలకు సమాధానాలు చెప్పడం లేదని... 70 ఏళ్లు దాటాయి కనుక తనకు మతి తప్పిందన్నట్టుగా కేసీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కు మరోసారి అధికారం ఇస్తే... రాష్ట్రాన్ని మరింత దోచుకుంటారని చెప్పారు. మైనార్టీలను మోసం చేసేందుకే... మోదీతో కుమ్మక్కైన కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని తెలిపారు.

More Telugu News