Uttar Pradesh: యూపీలో దారుణం: ఎస్సైను చితకబాదిన బీజేపీ నేత!

  • ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో దారుణం
  • కేసు విషయంలో మాట్లాడేందుకు వచ్చిన ఎస్సై
  • వెయిటర్ తో వాగ్వాదం నేపథ్యంలో ఘర్షణ

ఉత్తరప్రదేశ్ లో అధికార బీజేపీ నేత ఒకరు రెచ్చిపోయారు. ఓ కేసు విషయమై మాట్లాడేందుకు వచ్చిన ఎస్సైపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. కింద పడేసి కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చివరికి సదరు నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీలోని మీరట్ లో నిన్న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఓ కేసు విషయంలో మాట్లాడేందుకు ఎస్సై, మహిళా న్యాయవాదితో కలిసి బీజేపీ కౌన్సిలర్ మనీశ్ నడుపుతున్న హోటల్ కు వచ్చాడు. ఓనర్ మనీశ్ ను పిలవాలని హోటల్ సిబ్బందికి ఎస్సై చెప్పడంతో వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో హోటల్ వెయిటర్ కు, ఎస్సైకి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో అక్కడికి చేరుకున్న మనీశ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. హోటల్ దగ్గరకు వచ్చి గోల చేస్తావా? అంటూ ఎస్సై కాలర్ పట్టుకుని రెండు చెంపలు వాయించాడు. ఈ సందర్బంగా హోటల్ సిబ్బంది ఒకరు లాగడంతో ఎస్సై ఒక్కసారిగా వెనక్కు పడిపోయాడు.

చివరికి ‘నీ మాట వినేది లేదు.. ఏం చేసుకుంటావో చేసుకో’ అంటూ దుర్భాషలాడుతూ అక్కడి నుంచి మనీశ్ వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. సదరు కౌన్సిలర్ ను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు.

More Telugu News