reliance: జియో బంపర్ ఆఫర్.. రీచార్జీలపై 100 శాతం క్యాష్ బ్యాక్!

  • వివరాలను ప్రకటించిన రిలయన్స్ కంపెనీ
  • రూ.149 లేదా అంతకంటే ఎక్కువ రీచార్జీలకే
  • రిడీమ్ పాయింట్లు లభిస్తాయన్న సంస్థ

భారత టెలికాం రంగంలో జియో పేరుతో అడుగుపెడుతూనే రిలయన్స్ సంస్థ ప్రకంపనలు సృష్టించింది. అతి స్వల్ప కాలంలోనే ఏకంగా 10 కోట్ల మంది కస్టమర్లను సంపాదించుకుని సరికొత్త రికార్డును నెలకొల్పింది. తాజాగా దీపావళి పర్వదినం సందర్భంగా వినియోగదారులకు రిలయన్స్ జియో బంపరాఫర్ ప్రకటించింది. ‘మై జియో’ యాప్ ద్వారా రూ.149 లేదా అంతకంటే ఎక్కువ మొత్తం రిచార్జీ చేసుకునే వారికి 100 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తామని తెలిపింది.

ఇలా రీచార్జ్ చేసుకుంటే రిడీమ్ కూపన్లు లభిస్తాయనీ, వీటిని రిలయన్స్ డిజిటల్, డిజిటల్ ఎక్స్ ప్రెస్ మినీ స్టోర్లలో వాడుకోవచ్చని వెల్లడించింది. రూ.5,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో షాపింగ్ చేసేవారికే ఇది వర్తిస్తుందని తేల్చిచెప్పింది. ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ నవంబర్ 30 వరకూ అందుబాటులో ఉంటుందని రిలయన్స్ తెలిపింది. అలాగే రిడీమ్ కూపన్లను డిసెంబర్ 31లోపు వాడుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

మరోవైపు రూ.1,699తో రీఛార్జ్‌ చేసుకుంటే ఏడాది పాటు చెల్లుబాటు అయ్యే కొత్త ప్లాన్‌ను జియో ఆవిష్కరించింది. దీంతో రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకు1.5 జీబీ 4జీ డేటాతో పాటు 100 ఉచిత ఎస్‌ఎంఎస్ లు, అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ ఏడాది పాటు పొందవచ్చు.

More Telugu News