chattisgargh: కాల్పులతో దద్దరిల్లిన ఛత్తీస్ గఢ్.. ముగ్గురు మావోయిస్టుల కాల్చివేత!

  • బీజాపూర్ జిల్లాలో ఘటన
  • కూంబింగ్ లో బలగాలపై మావోల కాల్పులు
  • దీటుగా తిప్పికొట్టిన బలగాలు

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈరోజు బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రతా బలగాలు ముగ్గురు మావోయిస్టులను హతమార్చాయి. జిల్లాలోని మిర్తూర్ అటవీప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఈరోజు ఉదయం కూంబింగ్ నిర్వహించాయి.

బలగాలు మిర్తూర్ అటవీప్రాంతానికి చేరుకోగానే అప్రమత్తమైన మావోలు పోలీసులపై కాల్పులు ప్రారంభించారు. వెంటనే ప్రతిస్పందించిన భద్రతా బలగాలు మావోలపై ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోగా, మిగతావారు అక్కడి నుంచి పరారయ్యారు.

కాగా, ఘటనాస్థలి నుంచి మూడు తుపాకులు, మందుగుండు సామగ్రి, నిషేధిత సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల్లో తప్పించుకున్న మావోల కోసం గాలింపును తీవ్రతరం చేశారు.

More Telugu News