Amitabh Bachchan: ఉత్తరప్రదేశ్ రైతులకు బిగ్‌ బీ అమితాబచ్చన్‌ చేయూత.. రూ.5.5 కోట్ల రుణం చెల్లింపుకు నిర్ణయం!

  • 850 మంది రైతుల రుణాలు తీరుస్తానని వెల్లడి
  • అన్నదాతను ఆదుకుంటే ఆత్మసంతృప్తి అని ప్రకటన
  • గతంలో మహారాష్ట్రలోని 350 మంది రైతుల రుణాల చెల్లింపు

నటుడిగానే కాదు మానవత్వం ఉన్న మనిషిగా కూడా తాను ఉన్నత స్థానంలో ఉండే వ్యక్తినని బిగ్‌ బీ అమితాబచ్చన్‌ మరోసారి చాటుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 850 మంది అన్నదాతల రుణాల మొత్తం  ఐదున్నర కోట్ల రూపాయలను తాను చెల్లిస్తానంటూ ముందుకు వచ్చారు.

‘మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ ఆరుగాలం శ్రమిస్తున్న అన్నదాతకు ఉడతా భక్తిగా సాయం చేయడం ఎంతో ఆత్మసంతృప్తినిచ్చే అంశం. రుణం చెల్లించలేక దిక్కుతోచని స్థితిలో ఉన్న 850 మంది రైతులను గుర్తించాం. వారి రుణాలు నేను చెల్లిస్తాను’ అంటూ ఈ బాలీవుడ్‌ స్టార్‌ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు.

గతంలోనూ మహారాష్ట్రకు చెందిన 350 మంది రైతుల రుణాలను తాను చెల్లించిన విషయాన్ని ఈ సందర్భంగా అమితాబ్‌ గుర్తుచేసుకున్నారు. అలాగే వ్యభిచార రొంపిలోకి ఇతరుల బలవంతంతో ప్రవేశించి, నరకకూపంలో జీవితాలు సాగిస్తున్న మహిళలకు కొత్త జీవితాలను ప్రసాదించడంలో కృషి చేస్తున్న అజీత్‌సింగ్‌కు కూడా తాను సాయం అందజేస్తానని బిగ్‌ బీ ప్రకటించారు. కేబీసీ కరంవీర్‌లో కనిపించిన అజీత్‌ సింగ్‌కు శనివారమే తాను చెక్కు పంపిస్తున్నట్లు ప్రకటించారు.

More Telugu News