Navjot Kaur: జనాలను తొక్కుకుంటూ పోవాలని రైలు డ్రైవర్‌కు నేను చెప్పానా?: సిద్ధూ భార్య ఫైర్

  • రైలు ప్రమాద ఘటనపై కౌర్‌పై తీవ్ర విమర్శలు
  • రావణుడికి నిప్పు పెట్టగానే వెళ్లిపోయానన్న కౌర్
  • జనాలను రైల్వే ట్రాక్‌పై కూర్చోమని తాను చెప్పలేదన్న మంత్రి భార్య 

పంజాబ్ రైలు ప్రమాదంపై మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ భార్య నవజోత్ కౌర్ తీవ్రంగా స్పందించారు. తమపై వస్తున్న విమర్శలకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. శుక్రవారం రాత్రి రైలు ప్రమాదం జరిగినప్పుడు కౌర్ అక్కడే ఉండి ప్రసంగిస్తున్నారు. అయినప్పటికీ ఆమె తన ప్రసంగాన్ని కొనసాగించారు. అనంతరం ప్రమాద విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో ఆమెపై సర్వత్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

తనపై వస్తున్న విమర్శలపై కౌర్ ఆవేశంగా స్పందించారు. తానేమైనా వారిని రైలు పట్టాలపై కూర్చోమని ఆదేశించానా? అని ప్రశ్నించారు. ట్రాక్‌పై కూర్చున్న వారిని తొక్కుకుంటూ వెళ్లాలని డ్రైవర్‌కు చెప్పానా? అని నిలదీశారు. తాను వెళ్లిపోయిన 15 నిమిషాల తర్వాత ప్రమాదం జరిగిందని, ఆ విషయాన్ని తన సహాయకుడొకరు ఫోన్లో చెప్పారని కౌర్ తెలిపారు.

మీడియాలో తనపై వస్తున్న వార్తలను ఖండించిన ఆమె రావణుడి ప్రతిమకు నిప్పు పెట్టగానే అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు చెప్పారు. వందలాదిమంది యువకులు రైలు పట్టాలపైకి చేరి సెల్ఫీలు తీసుకున్నారని పేర్కొన్నారు. అక్కడ రావణ దహనం జరగడం ఇదేమీ కొత్త కాదని, ప్రతీ ఏటా జరుగుతూనే ఉందని చెప్పారు. ప్రమాదానికి రైల్వే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని కౌర్ పేర్కొన్నారు. రైలు వస్తున్నప్పుడు పట్టాలను క్లియర్ చేయాల్సిన బాధ్యత రైల్వేదేనని కౌర్ తేల్చి చెప్పారు.

More Telugu News