Telangana: సహజీవనం చేస్తున్న మహిళను వదిలించుకునే ప్రయత్నం.. హత్యకు కుట్ర!

  • భర్త నుంచి విడిపోయిన మహిళ
  • మరో వ్యక్తితో సహజీవనం
  • మహిళపై దాడి.. తప్పించుకున్న బాధితురాలు

సహజీవనం చేస్తున్న మహిళతో మనస్పర్థలు రావడంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడో ప్రబుద్ధుడు. ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలనే ఉద్దేశంతో హత్యకు పథక రచన చేసి దొరికిపోయాడు. ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లాకు చెందిన కేశబాగు లక్ష్మి (40)-భాస్కర్ భార్యాభర్తలు. 12 ఏళ్ల క్రితం వీరికి వివాహం కాగా, పదేళ్ల కుమార్తె ఉంది. భర్తతో గొడవల కారణంగా మూడేళ్ల క్రితం అతడిని విడిచిపెట్టి హైదరాబాద్ వచ్చేసిన లక్ష్మి హైదర్‌గూడలో కుమార్తెతో కలిసి జీవిస్తోంది.

ఈ క్రమంలో ఆమెకు అప్పటికే వివాహమైన అంజయ్య అనే వ్యక్తితో పరిచయం కావడంతో ఇద్దరూ కలిసి జీవనోపాధి కోసం ఘట్‌కేసర్ మండలంలోని అన్నోజిగూడకు వెళ్లి అక్కడే ఉంటున్నారు. అయితే, ఇటీవల వీరిమధ్య కూడా గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో లక్ష్మిని వదిలించుకోవాలని ప్లాన్ వేసిన అంజయ్య ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. గురువారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో సమీపంలోని ఇటుకుల బట్టీ వద్దకు తీసుకెళ్లి దాడిచేశాడు. అతడి దాడి నుంచి  తప్పించుకున్న లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంజయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News