nandiswar goud: టీడీపీలో చేరిన పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్

  • ఎల్.రమణ సమక్షంలో టీడీపీలో చేరిన నందీశ్వర్ గౌడ్
  • కేసీఆర్ అన్నీ మాయ మాటలే చెప్పారన్న రమణ
  • టీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెబుతారంటూ జోస్యం

మెదక్ జిల్లా పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎల్.రమణ మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు ఉండాలని ఎన్టీఆర్ కోరుకునేవారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల వైపే ఉంటుందని అన్నారు. తెలంగాణ ఏర్పాటులో కూడా టీడీపీ పాత్ర ఉందని చెప్పారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నీ మాయ మాటలు చెప్పారని... అధికారం చేపట్టిన తర్వాత వాటన్నింటినీ విస్మరించారని రమణ మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తామని ఉద్యమ సమయంలో చెప్పామే కానీ, ఎన్నికల సమయంలో చెప్పలేదని ఇటీవల ఓ టీఆర్ఎస్ ఎంపీ వ్యాఖ్యానించారని... ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే అనే విషయం దీంతో అర్థమవుతోందని అన్నారు. ఐదేళ్లు పరిపాలించమని కేసీఆర్ కు అధికారం ఇస్తే... తొమ్మిది నెలల ముందే చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.

More Telugu News