tv: నా శరీర భాగాల షేపుల గురించి అడిగాడు: న్యూస్ ప్రొడ్యూసర్ పై మహిళా రిపోర్టర్ ఫిర్యాదు

  • చాలా దారుణమైన ప్రశ్నలు అడిగాడు
  • మానసికంగా ఎంతో వేధించాడు
  • అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

మీటూ ఉద్యమం నేపథ్యంలో, మీడియా రంగంలో ఉన్న చీకటి కోణాలు కూడా బయటకు వస్తున్నాయి. తాజాగా ఓ ప్రైవేటు టీవీ చానల్ లో గతంలో పని చేసిన ఓ సీనియర్ న్యూస్ ప్రొడ్యూసర్ పై ఒక మహిళా జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగికంగా, మానసికంగా తనను ఎంతో వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది.

ఈ నేపథ్యంలో సదరు సీనియర్ న్యూస్ ప్రొడ్యూసర్ ను నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు మహిళా జర్నలిస్టుపై ఆయన కూడా ఘజియాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆమె, అతని కాబోయే భర్త ఇద్దరూ కలసి డబ్బు (25 లక్షలు) కోసం తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ ఆరోపించారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే, తన శరీర భాగాల షేపులు గురించి తనను అడిగాడని బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. ఒక సర్వే నిర్వహిస్తున్నానని చెప్పాడని... ఆ తర్వాత మరింత దారుణమైన ప్రశ్నలు అడిగాడని చెప్పింది. ఆఫీసులో మానసికంగా తనను ఎంతో వేధించాడని తెలిపింది.

తాను అప్పుడు (2016) కొత్తగా ఉద్యోగంలో చేరానని... అందుకే ధైర్యంగా ఈ విషయాన్ని ఎవరితో చెప్పుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, అతని నుంచి తనకు కూడా అలాంటి అనుభవమే ఎదురైందని మరో మహిళ చెప్పడంతో... ఇప్పుడు ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పాలనుకున్నానని తెలిపింది. ఒకవేళ అతను తనకు క్షమాపణలు చెప్పినా.... అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరింది. అప్పుడే ఇతర మహిళలను అతను వేధించడం ఆపేస్తాడని తెలిపింది. 

More Telugu News