cm ramesh: జీవీఎల్ జాగ్రత్త.. నీ నాలుక కోస్తా.. నువ్వొక పోరంబోకువి!: బుద్ధా వెంకన్న ఫైర్

  • సీఎం రమేష్ ను చంద్రబాబు కాపాడటమేంటి?
  • రమేష్ తప్పు చేస్తే నిరూపించు
  • చంద్రబాబుపై నిందలు వేస్తే చమడాలు ఒలుస్తా

టీడీపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు కాపాడుతున్నారనే విధంగా జీవీఎల్ వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుబట్టారు. సీఎం రమేష్ ను చంద్రబాబు కాపాడటమేంటని ప్రశ్నించారు.

సీఎం రమేష్ తప్పు చేస్తే నిరూపించాలని అన్నారు. ఇతరుల అవినీతి గురించి మాట్లాడేముందు బీజేపీ నేతలు వారిపై సీబీఐ విచారణ వేయించుకోవాలని డిమాండ్ చేశారు. అతిపెద్ద అవినీతిపరుడు కన్నా లక్ష్మీనారాయణపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మీ ఉడత ఊపులకు బెదిరిపోయేవారు ఇక్కడ ఎవరూ లేరని అన్నారు. బీజేపీ నేతలు 10 మాట్లాడితే మా వాళ్లతో 100 మాట్లాడిస్తానని చెప్పారు.

'మీరు రాజకీయంగా మాట్లాడితే మేము రాజకీయంగా మాట్లాడతాం... మీరు వ్యక్తిగతంగా మాట్లాడితే మేము కూడా వ్యక్తిగతంగానే మాట్లాడతాం' అన్నారు. చంద్రబాబుపై ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని... ఇది అంత ఆషామాషీ విషయం కాదని చెప్పారు. రాజకీయాలను విలువలు లేకుండా చేస్తున్నారంటూ కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ లపై మండిపడ్డారు.

అవినీతి గురించి కన్నా, జీవీఎల్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. మీరు చేస్తున్న ఆరోపణలను ఒకటైనా నిరూపించగలరా? అని సవాల్ విసిరారు. పొద్దున లేచినప్పటి నుంచి చంద్రబాబు జపం తప్ప మరేమీ లేదని ఎద్దేవా చేశారు. 'నారా లోకేష్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. జీవీఎల్ జాగ్రత్త. నీ నాలుక కోస్తా. కావాలంటే కేసు పెట్టుకో. పిచ్చిపిచ్చి వేషాలు వేయకు. నువ్వొక పోరంబోకువి. దేశంలోనే గొప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు. అలాంటి వ్యక్తిపై నిందలు వేస్తావా? చమడాలు ఒలుస్తా' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

More Telugu News