Pawan Kalyan: పవన్ కల్యాణ్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది: జీవీఎల్

  • లూటీ చేయడానికేనా మీ కొడుకును ఐటీ మంత్రిని చేశారు
  • లోకేష్ కు ఏం అర్హత ఉందని పవన్ అడుగుతున్నారు
  • ప్రతి స్కీంలో ఒక స్కాం ఉందనే విషయం ప్రజలకు అర్థమయిపోయింది

ఏపీలో ఐటీ పేరుతో లూటీ జరుగుతోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఐటీ ఉద్యోగాల కల్పన పేరుతో... తమ బినామీలకు ఐటీ కంపెనీలను కట్టబెడుతూ అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఐటీ కంపెనీలను ఏర్పాటు చేసిన వారి పేర్లను బయటపెట్టకుండా, గోప్యంగా ఉంచుతున్నారని విమర్శించారు. ప్రపంచంలోనే తాము ఎక్కువ పారదర్శకత పాటిస్తున్నామని చెప్పుకునే ఈ ప్రభుత్వం... ఈ వివరాలను ఎందుకు దాస్తోందని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రతి స్కీంలో ఒక స్కాం ఉందనే విషయం ప్రజలందరికీ అర్థమయిపోయిందని చెప్పారు.

మంత్రి లోకేష్ కు ఏం అర్హత ఉందంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ అడుగుతున్నారని, పవన్ అడిగిన ప్రశ్న సరైనదేనని జీవీఎల్ అన్నారు. ఏం అర్హత ఉందని మీ అబ్బాయిని రెండు, మూడు శాఖలకు మంత్రిని చేశారని చంద్రబాబును ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. పవన్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉందని అన్నారు. లూటీ చేయడానికేనా మీ కొడుకును ఐటీ మంత్రిని చేశారని ప్రశ్నించారు. 

More Telugu News