pawan kalyan: ప్రజలను అధికారులు బెదిరిస్తున్నట్టు తెలిసింది.. తోలు తీస్తా: పవన్ కల్యాణ్

  • తుపాను నష్టాన్ని వీడియోల రూపంలో బయటకు తీసుకెళ్తాం
  • బాధితులకు సాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది
  • జరిగిన నష్టాన్ని పార్టీ తరపున నమోదు చేస్తాం

తుపాను వల్ల పచ్చటి ఉద్దానం మొత్తం నాశనం అయిపోయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. నేలకూలిన ఇళ్లు, తోటలు చూస్తుంటే తనకు కన్నీళ్లు వస్తున్నాయని అన్నారు. మూడు రోజుల పాటు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తానని... జరిగిన విధ్వంస నష్టాన్ని పార్టీ తరపున నమోదు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత రంగాల వారీగా నష్ట నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపుతానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, బాధితులకు న్యాయం చేస్తానని చెప్పారు.

ప్రజలకు సాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పవన్ విమర్శించారు. కేరళకు తుపాను వస్తే ప్రపంచం మొత్తానికి తెలిసిపోయిందని... ఇక్కడి తుపాను బయట ప్రపంచానికి తెలియడం లేదని అన్నారు. తుపాను నష్టాన్ని వీడియోల రూపంలో బయట ప్రపంచానికి తీసుకెళ్తామని చెప్పారు. కూరగాయల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. ప్రజలను కొందరు అధికారులు బెదిరిస్తున్నట్టు తెలిసిందని... అలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే తోలు తీస్తానని హెచ్చరించారు. 

More Telugu News