Maharashtra: మంచు లక్ష్మిని ఇబ్బంది పెట్టిన ఎయిర్ ఇండియా.. వరుస ట్వీట్లు చేసిన నటి!

  • పుణె విమానాశ్రయంలో చిక్కుకున్న లక్ష్మి
  • ఎయిర్ ఇండియా సిబ్బంది పట్టించుకోలేదని వెల్లడి
  • టార్చర్ పెట్టారని ఆవేదన

ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాపై నటి మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి కారణం చెప్పకుండా దాదాపు 4 గంటల పాటు తనను క్యూలైన్ లో నిలబెట్టారని వెల్లడించింది. ఈ మేరకు ఆమె వరుస ట్వీట్లు చేసింది. ప్రయాణికులను ఎయిర్ ఇండియా అధికారులు కనీసం పట్టించుకోలేదని వ్యాఖ్యానించింది. దీంతో ఆహారం, నీళ్లు లేకుండా పలువురు ప్రయాణికులు పుణె ఎయిర్ పోర్టులో చిక్కుకున్నారని తెలిపింది.

ఎయిర్ ఇండియా విమానం బుధవారం మధ్యాహ్నం 12.15 గంటలకు తొలుత బయలుదేరాల్సి ఉందని లక్ష్మి చెప్పింది. అయితే మరో నాలుగు గంటలైనా విమానం జాడ లేకుండా పోయిందని వెల్లడించింది. తాము గట్టిగా నిలదీస్తే అక్కడి ఎయిర్ ఇండియా అధికారి జవాబు చెప్పకుండా వెళ్లిపోయాడని పేర్కొంది. చివరికి తాను హైదరాబాద్ కు ఫోన్ చేస్తే వాతావరణం బాగోలేని కారణంగానే విమానం రద్దయినట్లు తెలిసిందని మంచు లక్ష్మి చెప్పింది. 'ప్రయాణికులను అంత టార్చర్ పెట్టడంలో ఎయిర్ ఇండియాలో అంత ఆనందం ఎందుకుందో!' అని ఆమె విమర్శించింది. ఈ మేరకు లక్ష్మి వరుస ట్వీట్లు చేసింది.

More Telugu News