Andhra Pradesh: దుర్గగుడిలో కొబ్బరి చిప్పలు, చెప్పులు కొట్టేసిన దొంగలే టీడీపీలో ఉన్నారు!: కన్నా లక్ష్మీ నారాయణ

  • టీడీపీ నేతల భాష అభ్యంతరకరంగా ఉంది
  • మోదీని చంద్రబాబు తిట్టినప్పుడు అందరూ ఏమైపోయారు
  • ఏపీ సీఎంకు ఐదు ప్రశ్నలు సంధించిన కన్నా

ప్రతిపక్ష పార్టీల నేతలను విమర్శించడానికి టీడీపీ నేతలు వాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉంటోందని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. చంద్రబాబును కేసీఆర్ తిట్టగానే గోలగోల చేసినవాళ్లు, ప్రధాని మోదీని చంద్రబాబు తిట్టినప్పుడు ఏమైపోయారని ప్రశ్నించారు. టీడీపీ నేతల దిగజారుడు వ్యాఖ్యలపై గతంలో ఓసారి ధర్నా కూడా చేశామన్నారు. టీడీపీ నేత సీఎం రమేశ్ లైవ్ టీవీ షోలో బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావును పచ్చిబూతులు తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో కన్నా మాట్లాడారు.

ప్రస్తుతం టీడీపీలో దుర్గగుడి దగ్గర కొబ్బరి చిప్పలు, చెప్పులు కొట్టేసే దొంగలు మాత్రమే ఉన్నారని ఎద్దేవా చేశారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ నిందితులంతా టీడీపీలోనే ఉన్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని ఇష్టానుసారం దోచుకుంటున్న టీడీపీ నేతలు కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శవాల మీద పైసలు ఏరుకునే విధంగా ఆ పార్టీ నేత వ్యవహారశైలి తయారయిందన్నారు. తిత్లీ తుపానును కూడా తన రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు వాడుకుంటున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు కన్నా లక్ష్మీనారాయణ ఐదు ప్రశ్నలను సంధించారు.

1)  పల్నాడులో అక్రమ మైనింగ్‌పై సీబీఐతో విచారణ జరిపించుకోగలరా ?
2) అంచనాలు పెంచి సీఎం రమేశ్‌కు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చిన మాట వాస్తవం కాదా?
3)  మంత్రి ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బా రెడ్డిలను కూర్చోబెట్టి వాటాలు పంచుకోమని చెప్పలేదా?
4)  రూ.480 కోట్లతో నిరుద్యోగులకు ఇచ్చే శిక్షణ కాంట్రాక్టును ప్రైవేటు సంస్థలకు అప్పగించడంలో అంతర్యం ఏమిటి?
5)  ఐటీ దాడులు జరిగితే రాష్ట్రంలో భావోద్వేగాలను ఎందుకు రెచ్చగొడుతున్నారు?

More Telugu News