Kerala: శబరిమలలో టెన్షన్ టెన్షన్ .. మహిళా భక్తులను అడ్డుకుంటున్న ఆందోళనకారులు!

  • భారీ భద్రత కల్పించిన పోలీసులు
  • సుప్రీం తీర్పుతో ఉద్రిక్త పరిస్థితి
  • నేడు తెరుచుకోనున్న ఆలయం

కేరళలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయ్యప్పస్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు వెళ్లవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉద్రిక్తతను రాజేస్తోంది. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ ‘సేవ్ శబరిమల’ పేరుతో ఆందోళనకారులు భారీగా ఇక్కడి పతనంతిట్ట బస్టాండ్ కు చేరుకుంటున్నారు. కేరళలో స్వామివారి దర్శనానికి వచ్చే మహిళల వయసును పరిశీలించిన తర్వాతే ఆలయం వైపు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు.

ఈరోజు సాయంత్రం శబరిమల ఆలయ ద్వారాలను తెరవనున్నారు. ఈ నేపథ్యంలో నీలక్కల్ ప్రాంతానికి చేరుకున్న ఇద్దరు మహిళలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. అయితే భారీగా మోహరించిన పోలీసులు ఆ ఇద్దరిని ముందుకు తీసుకెళ్లారు. 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఆలయంలోకి ప్రవేశించరాదన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో పలువురు సుప్రీం తీర్పుపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏపీకి చెందిన అన్ని వయసుల మహిళలున్న మరో కుటుంబాన్ని కూడా ఆందోళనకారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు గుంపును చెదరగొట్టి భక్తులను కొండపైకి తీసుకెళ్లారు. అయితే కొండపైన సన్నిధానం వద్ద ఉన్న ఆందోళకారులు భక్తులను అడ్డుకుని వెనక్కు పంపేస్తున్నట్లు తెలుస్తోంది.

More Telugu News