Chandrababu: రాజ్‌నాథ్‌తో భేటి అయిన టీడీపీ నేతలు.. వీధినపడిన కుటుంబాలను ఆదుకోవాలని వినతి

  • ‘తిత్లీ’ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని లేఖ
  • తుపాను కారణంగా రూ.3435.29 కోట్ల నష్టం
  • తక్షణ సాయం కింద రూ.1200 కోట్లు ఇవ్వాలని వినతి

‘తిత్లీ’ తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లిందని.. ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయని, వారిని ఆదుకోవాలని కోరుతూ సీఎం చంద్రబాబు.. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాశారు. నేడు రాజ్‌నాథ్ మంగళగిరిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఢిల్లీకి తిరిగి వెళ్తున్న రాజనాథ్‌ను గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో టీడీపీ ఎంపీలు, మంత్రులు సమావేశమై చంద్రబాబు లేఖను అందజేశారు.

‘తిత్లీ’ తుపాను కారణంగా రూ.3435.29 కోట్ల నష్టం వాటిల్లిందని... తక్షణ సాయం కింద రూ.1200 కోట్లు ఇవ్వాలని చంద్రబాబు లేఖలో కోరారు. 36 లక్షల హెక్టార్లకు పైగా పంట నష్టం వాటిల్లిందని.. రెండు లక్షల కుటుంబాలు వీధిన పడ్డాయని చంద్రబాబు తెలిపారు. సాయం అందించే విషయంలో రాజ్‌నాథ్ సానుకూలంగా స్పందించినట్టు మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమ మీడియాకు వెల్లడించారు.

More Telugu News