G Venkataswamy: టీఆర్ఎస్ కు షాకిస్తూ, కాంగ్రెస్ లో చేరనున్న కాకా తనయుడు వినోద్!

  • టీఆర్ఎస్ కు మరో షాక్!
  • కాకా తనయులు తిరిగి కాంగ్రెస్ లోకి!
  • సోదరుడి నిర్ణయం కోసం వేచిచూస్తున్న వినోద్

టీఆర్ఎస్ కు మరో షాక్ తగలనుంది. కేంద్ర మాజీ మంత్రి జీ వెంకటస్వామి (కాకా) తనయుడు, పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వినోద్, టీఆర్ఎస్ కు రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైనట్టు తెలుస్తోంది. ఇటీవల ఆయన ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో సమావేశమై, తన చేరికపై చర్చించినట్టు సమాచారం.వీలైతే దసరాలోపు లేదంటే 20వ తేదీన భైంసాలో జరిగే రాహుల్ గాంధీ సభలో ఆయన మూడు రంగుల కండువాను కప్పుకుంటారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

ఇదే సమయంలో సీనియర్ టీఆర్ఎస్ నేతగా, ప్రభుత్వ సలహాదారుగా ఉన్న జీ వివేక్ పరిస్థితి ఏంటన్న కొత్త చర్చ మొదలైంది. ఈ సోదరులు గతంలో ఎన్నడూ వేర్వేరు పార్టీల్లో లేరు. ఏ నిర్ణయమైనా కలిసే తీసుకునే వివేక్, వినోద్ లు ఈ దఫా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయమై ఉత్కంఠ నెలకొని ఉంది. వినోద్ సైతం తన సోదరుడు వివేక్ తీసుకునే నిర్ణయం కోసం వేచి చూస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి.

2013, జూన్ 2న తమ తండ్రి వెంకటస్వామి చిరకాల కోరికైన ప్రత్యేక రాష్ట్రం టీఆర్ఎస్ తోనే సాధ్యమైనందున తాము ఆ పార్టీలో చేరుతున్నట్టు వీరిద్దరూ ప్రకటించారు. ఆ తరువాత 2014 లో ఎన్నికలకు ముందు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని చెప్పి మాట మార్చారని ఆరోపిస్తూ, తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చారు. పెద్దపల్లి నుంచి ఎంపీగా వివేక్, చెన్నూరు అసెంబ్లీ స్థానానికి వినోద్ పోటీ పడి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత టీఆర్ఎస్ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష'లో భాగంగా 2016లో వీరిద్దరూ తిరిగి టీఆర్ఎస్ లో చేరారు.

More Telugu News