Chandrababu: సీఎం చంద్రబాబు తన పద్ధతి మార్చుకోవాలి: పవన్ కల్యాణ్

  • ఏపీలో జరుగుతున్న దారుణాలపై బాబు మాట్లాడరే?
  • ఏపీని చంద్రబాబు, మోదీ దారుణంగా మోసం చేశారు
  • విజన్ 2020లో చెప్పిన ఉద్యోగాలు, రోడ్లు ఎక్కడ?

ఏపీలో జరుగుతున్న దోపిడీలు, దారుణాలపై సీఎం చంద్రబాబు మాట్లాడలేకపోతున్నారని, ఆయన తన పద్ధతి మార్చుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. ‘జనసేన’ కవాతు అనంతరం ధవళేశ్వరం వద్ద నిర్వహించిన బహిరంగం సభలో పవన్ మాట్లాడుతూ, ఏపీ ప్రజలను చంద్రబాబు, మోదీ దారుణంగా మోసం చేశారని ఆరోపించారు.

2014లోనే తమ పార్టీకి బలం ఉందని, అయినప్పటికీ ఓట్లు చీల్చి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేయడం ఇష్టం లేకనే పోటీ చేయలేదని, చంద్రబాబుకు మద్దతుగా నిలిచినా ఎటువంటి పదవులూ ఆశించలేదని, రాష్ట్రానికి మంచి పాలన ఇవ్వాలని మాత్రం నాడు చంద్రబాబును కోరానని గుర్తుచేసుకున్నారు. జనసేన పార్టీ భవన నిర్మాణానికి కూడా అనుమతి ఇవ్వలేదని, టీడీపీ పల్లకీని తమ పార్టీ ఎప్పుడూ మోస్తూనే ఉండాలా? అని ప్రశ్నించారు.

ఏ విషయంలోనూ చంద్రబాబు తనను సంప్రదించలేదని, చంద్రబాబు అవినీతిపై మాట్లాడితే ఉన్నపళంగా తాను మారిపోయానని అంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా మౌలిక సదుపాయాలు లేవని, విజన్ 2020లో చెప్పిన రెండు కోట్ల ఉద్యోగాలు, రోడ్లు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా జన్మభూమి కమిటీలు దోచుకుంటున్నాయని, అవి జన్మభూమి కమిటీలా? గూండా కమిటీలా? అంటూ టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News