ME TOO: ‘మీ టూ’కు బ్రేక్.. జర్నలిస్ట్ ప్రియా రమణిపై కేంద్ర మంత్రి అక్బర్ పరువునష్టం దావా!

  • అక్బర్ తనను వేధించాడని చెప్పిన ప్రియ 
  • ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో దాఖలు
  • ఆరోపణలన్నీ రాజకీయ కుట్రేనన్న అక్బర్

సినీ రంగంతో పాటు మీడియా, రాజకీయ రంగాల్లో మీ టూ ఉద్యమం ప్రకంపనలు కొనసాగుతున్నాయి. బాలీవుడ్ నటులు నానా పటేకర్, అలోక్ నాథ్, డైరెక్టర్లు సాజిద్ ఖాన్, సుభాష్ ఘయ్, మాజీ జర్నలిస్టు, కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ తమను లైంగికంగా వేధించారని ఇటీవల పలువురు మహిళలు ఆరోపించారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ గతంలో జర్నలిస్టుగా పనిచేసిన సమయంలో తనను వేధించాడని మహిళా జర్నలిస్ట్ ప్రియా రమణి ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రియా రమణిపై అక్బర్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు.

ఎంజే అక్బర్ న్యాయవాది కరంజవాలా పటియాలా హౌస్ కోర్టులో ఈ రోజు మంత్రి తరఫున పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఓ సీనియర్ జర్నలిస్ట్ తనను లైంగికంగా వేధించాడన్న ప్రియా రమణి, సదరు వ్యక్తి ఎంజే అక్బర్ అని బయటపెట్టి సంచలనం సృష్టించారు. దీంతో మరో 10 మంది మహిళా జర్నలిస్టులు తాము కూడా  అక్బర్ చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యామని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో అక్బర్ తనపై వచ్చిన అభియోగాలను ఖండించారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై ఆరోపణలు చేస్తున్నారనీ, తనపై తప్పుడు ఆరోపణలు చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఈ రోజు ప్రియా రమణిపై పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు.

More Telugu News