Chennai: ప్రియుడి కోసం భర్తను హత్య చేసేందుకు నవ వధువు ప్లాన్... చివర్లో సీన్ రివర్స్!

  • చదువుకునే రోజుల్లో జగన్ తో అనిత ప్రేమ
  • నెల రోజుల క్రితం కదిరవన్ తో వివాహం
  • దుండగులు దాడి చేసినట్టుగా ప్లాన్ వేసిన అనిత
  • దాడి సమయంలో స్పందించక పోవడంతో పోలీసులకు అనుమానం

తన ప్రియుడిని వదిలి ఉండలేని ఓ నవవధువు, అతనితో కలసి భర్తను హతమార్చేందుకు ప్లాన్ వేసి విఫలమై, పోలీసులకు చిక్కింది. చెన్నై శివార్లలో జరిగిన ఈ నాటకీయ పరిణామంపై పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కదిరవన్ (30)కు నెల రోజుల క్రితం తూత్తుకుడికి చెందిన అనిత (25)తో వివాహమైంది. ఆపై గత వారాంతంలో వారు సముద్ర తీరానికి వాహ్యాళికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరి బైకును అడ్డుకున్న ఇద్దరు కదిరవన్ పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అనిత ధరించిన 12 సవర్ల నగలు, రూ. 1000 తీసుకుని పరారయ్యారు.

తీవ్రగాయాలతో పడివున్న కదిరవన్ ను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించిన అనిత, పోలీసులకు తానే స్వయంగా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించారు. కదిరవన్ పై దాడి జరుగుతున్న సమయంలో అనిత ఏ మాత్రం చలనం లేకుండా, చూస్తుండిపోయినట్టు కనిపించడంతో, ఆమెను తమదైన శైలిలో విచారించారు. దీంతో ఆసలు నిజం బయటకు వచ్చింది.

కాలేజీలో చదువుతున్న సమయంలో జగన్ అనే యువకుడిని ప్రేమించానని, అయితే, తాము పెళ్లి చేసుకోవాలని భావించిన సమయంలో తనకు కదిరవన్ తో పెళ్లి చేశారని చెప్పింది. దుండగుల దాడి జరిగినట్టుగా ప్లాన్ చేశానని, అతని హత్య తరువాత తామిద్దరమూ కలసి జీవిద్దామని భావించామని చెప్పింది. ఆమెను విచారించిన తరువాత పోలీసులు మధురైలో ఉన్న జగన్ ను కూడా అరెస్ట్ చేసి, ఇద్దరినీ కటకటాల వెనక్కు నెట్టారు.

More Telugu News