Sapna Chowdhury: ప్రోగ్రామ్ కు వస్తానని చెప్పి ఎగ్గొట్టిన డ్యాన్సర్ సప్నా చౌదరి... రణరంగం!

  • లక్నోలో సప్నా డ్యాన్స్ చేస్తుందని ప్రచారం
  • రూ. 2,500తో టికెట్లు కొన్న అభిమానులు
  • ఆమె రాకపోవడంతో విధ్వంసం
  • కేసు నమోదు చేసిన పోలీసులు

ఉత్తరాదిన పేరున్న హర్యానా సింగర్, డ్యాన్సర్ సప్నా చౌదరి మరోసారి చిక్కుల్లో పడింది. లక్నోలో ఏర్పాటు చేసిన ఓ లైవ్ ప్రోగ్రామ్ కు వస్తానని చెప్పిన ఆమె, రాకపోవడంతో అభిమానులు రణరంగం సృష్టించగా, పోలీసులు సప్న సహా ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

లక్నోలోని స్మృతీ ఉపవన్ కార్యక్రమంలో సప్న డ్యాన్స్ చేస్తుందని పెద్దఎత్తున ప్రచారం జరుగగా, ఒక్కో టికెట్ రూ. 2,500 పెట్టి కొనుగోలు చేసిన అభిమానులు వేదిక వద్దకు వచ్చారు. ఆఖరి నిమిషంలో సప్న రావడం లేదని నిర్వాహకులు ప్రకటించడంతో, తీవ్ర ఆగ్రహంతో అక్కడి ఫర్నీచర్ ను, వేదికను, కుర్చీలను ధ్వంసం చేశారు.

ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా, విషయం తెలుసుకున్న పోలీసులు వేదిక వద్దకు చేరుకుని అభిమానులపై లాఠీ చార్జ్ చేసి అదుపు చేశారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించామని తెలిపారు. సప్న సహా నిర్వాహకులపై ఫోర్జరీ, మోసం తదితర సెక్షన్ల కింద కేసులు పెట్టామని వెల్లడించారు.

More Telugu News