fire on wife: ఇంట్లో మద్యం సేవించ వద్దన్న భార్యపై కాల్పులు.. బీఎస్‌ఎఫ్‌ రిటైర్డు జవాన్‌ నిర్వాకం

  • పీకల దాకా మద్యం సేవించి ఇంటికి రాక
  • ఇంట్లో కూడా తాగడానికి సన్నద్ధం
  • వద్దని భార్య చెప్పడంతో ఆగ్రహం

‘ఇప్పటికే పూటుగా తాగి ఉన్నారు. ఇంట్లో కూడా మళ్లీ అదేం పనండి, తాగొద్దండి’ అన్న పాపానికి ఆగ్రహంతో ఊగిపోయిన ఓ రిటైర్డు బీఎస్‌ఎఫ్‌ జవాను ఏకంగా భార్యపైనే కాల్పులు జరిపాడు. అదృష్టవశాత్తు తూటా పక్క నుంచి వెళ్లడంతో ఆమె బతికి పోయింది. మహారాష్ట్ర పుణే నగరంలోని తాడివాలా రోడ్డు ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలావున్నాయి.

 తాడివాలా ప్రాంతంలో నివాసం ఉంటున్న బాలాజీ రంగనాథ్‌ బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌)లో పనిచేసి పదవీ విరమణ చేశారు. ఇతనికి భార్య కడుబాయి, కుమారుడు యోగేష్‌ ఉన్నారు. మందుబాబు అయిన రంగనాథ్‌ పూటుగా మద్యం సేవించి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఇంటికి వచ్చాడు. భార్య తలుపు తీశాక ఇంట్లోకి ప్రవేశించిన రంగనాథ్‌ అక్కడ మళ్లీ బాటిల్‌ ఓపెన్‌ చేశాడు.  

భర్త పరిస్థితి సరిగా లేకపోవడం గమనించిన భార్య కడుబాయి మరింక తాగవద్దని ప్రాధేయపడింది. అప్పటికే మద్యం మత్తు తలకెక్కి ఉన్న రంగనాథ్‌ భార్య అడ్డు పడడంతో విచక్షణ కోల్పోయాడు. తన రివాల్వర్ తీసుకుని ఆమెపై కాల్పులు జరిపాడు. అయితే తూటా ఓ ఇంచ్ తేడాతో కడుబాయి పక్క నుంచి దూసుకుపోవడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. బాధితురాలి కొడుకు యోగేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు బాలాజీ రంగనాథ్‌ను అరెస్టు చేశారు. అతని వద్ద ఉన్న లైసెన్స్‌డ్‌ రివాల్వర్ ను  స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News