Reshma Rathore: 'వైరా' టికెట్ ను హీరోయిన్ రేష్మా రాథోడ్ కు ఓకే చేయనున్న బీజేపీ!

  • ఇప్పటికే ప్రజల్లో ప్రచారం చేసుకుంటున్న రేష్మ
  • ఆమెకే టికెట్ ఇచ్చేందుకు అధిష్ఠానం నిర్ణయం
  • పార్టీ ఆదేశిస్తే సిద్ధమేనన్న రేష్మా రాథోడ్

సినీ నటి, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి భూక్యా రేష్మా రాథోడ్ కు 'వైరా' అసెంబ్లీ టికెట్ ఖాయమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే అసెంబ్లీలోకి ప్రవేశించాలన్న లక్ష్యంతో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తనకున్న పరిచయాలతో ప్రజలతో మమేకమవుతూ, నరేంద్ర మోదీ సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేస్తున్న ఆమెనే బరిలోకి దించాలని పార్టీ అగ్రనేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

తాను వైరా నుంచి పోటీ చేసే విషయంలో రేష్మా స్పందిస్తూ, పార్టీ ఆదేశిస్తే, పోటీ చేసేందుకు సిద్ధమేనని అన్నారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారానికి కేంద్రం ఆమోదం తెలిపినా, కేసీఆర్ ప్రభుత్వం సహకరించలేదని, ఫ్యాక్టరీని మెదక్ తరలించాలని చూసిందని ఆమె విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం వస్తే, బయ్యారంలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి వేలాదిమందికి ఉపాధి కల్పిస్తామని అన్నారు. ఆయుష్మాన్ భారత్ వంటి అద్భుత పథకానికి కేంద్రం శ్రీకారం చుడితే, తెలంగాణలో మాత్రం దాన్ని అమలు చేయడానికి నిరాకరించారని, ఇది ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యమేనని అన్నారు.

More Telugu News