KCR: దసరా తరువాతే నేనొస్తా... అప్పటిదాకా మీరే చూసుకోండి!: పార్టీ అభ్యర్థులతో కేసీఆర్

  • మొత్తం 100 సభల్లో పాల్గొననున్న కేసీఆర్
  • తొలుత జిల్లా స్థాయిలో, ఆపై నియోజకవర్గాల్లో
  • అభ్యర్థుల మార్పుపై ఆందోళన వద్దని భరోసా

దసరా పండగ తరువాతనే తాను రంగంలోకి దిగి, వరుసగా సభలకు హాజరవుతానని, అప్పటివరకూ నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలను అభ్యర్థులే చూసుకోవాలని టీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. రాష్ట్రంలో దసరా పండగను పెద్దఎత్తున నిర్వహిస్తారన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన, పలువురు అభ్యర్థులతో ఫోన్లో మాట్లాడుతూ, తొలుత అనుకున్న ప్రకారమే 100 సభల్లో తాను పాల్గొంటానని ఆయన వెల్లడించినట్టు తెలుస్తోంది.

తొలి దశలో జిల్లాల స్థాయిలో బహిరంగ సభలు ఉంటాయని, ఆపై నియోజకవర్గాల స్థాయిలో సభలు ఉంటాయని అన్నారు. సభల షెడ్యూల్ ప్రకారం నేతలు సమాయత్తం కావాలని అన్నారు. దసరాకు ప్రజలు తమ బంధువుల ఇళ్లకు, స్వగ్రామాలకు వెళుతుంటారు కాబట్టి, పండగ తరువాతే తాను వస్తానని కేసీఆర్ చెప్పారట. ప్రతిపక్షాల అభ్యర్థులు ఎవరన్న విషయాన్ని ఎవరూ పట్టించుకోవద్దని, అభ్యర్థుల మార్పు ఉంటుందంటూ వస్తున్న వార్తల గురించి కూడా ఆలోచించుకోవద్దని కేసీఆర్ అభయం ఇచ్చినట్టు తెలుస్తోంది.

More Telugu News