New Delhi: న్యాయమూర్తి భార్య, కుమారుడిని కాల్చి... తానే కాల్చానని ఫోన్ చేసి చెప్పిన సెక్యూరిటీ ఆఫీసర్!

  • గురుగ్రామ్ లో దారుణ ఘటన
  • జడ్జి కుటుంబీకులకు సెక్యూరిటీగా వెళ్లిన గార్డు
  • సర్వీస్ రివాల్వర్ తో కాల్చివేత
  • తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో భార్యా, కుమారుడు

గురుగ్రామ్ లో దారుణాతి దారుణం జరిగింది. రెండేళ్లుగా ఓ న్యాయమూర్తి వద్ద సెక్యూరిటీ అధికారిగా పనిచేస్తున్న మహిపాల్ సింగ్ అనే వ్యక్తి, నడిరోడ్డుపై న్యాయమూర్తి భార్య, కుమారుడిపై కాల్పులు జరిపాడు. ఆ వెంటనే జడ్జికి ఫోన్ చేసి "నీ భార్య, కుమారుడిని కాల్చాను" అని చెప్పాడు. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, అదనపు సెషన్స్ న్యాయమూర్తిగా ఉన్న కిషన్ కాంత్ శర్మ వద్ద మహిపాక్ సెక్యూరిటీగా ఉన్నాడు.

నిన్న ఆయన భార్య రీతూ (38), కుమారుడు ధ్రువ్ (18) షాపింగ్ కు వెళ్లిన వేళ, భద్రత కోసం మహిపాల్ కూడా వెళ్లాడు. న్యాయమూర్తికి ఫోన్ చేసేందుకు క్షణాల ముందు వారిద్దరిపైనా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ రీతూ, ధ్రువ్ లు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, ప్రాణాలతో పోరాడుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఆ తరువాత మహిపాల్ ను అరెస్ట్ చేసిన పోలీసులు, ఎందుకోసం కాల్పులకు తెగబడ్డాడన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహిపాల్ అతని సర్వీస్ రివాల్వర్ తోనే కాల్పులు జరిపాడని, చాలా దగ్గర్నుంచి కాల్చినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారని గురుగ్రామ్ తూర్పు డీసీపీ సులోచనా గుజ్రాల్ వెల్లడించారు.

More Telugu News