Telangana: చంద్రబాబునే టార్గెట్ చేయడానికి కారణాన్ని చెప్పిన కేటీఆర్!

  • తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు
  • చూస్తూ ఊరికే కూర్చుంటామా?
  • సైబరాబాద్ మొగోడే అయితే, అమరావతి ఎందుకు కట్టలేదు
  • మీడియాతో కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబును టార్గెట్ చేయడానికి కారణాన్ని కేటీఆర్ బయటపెట్టారు. పక్క రాష్ట్రానికి సీఎంగా ఉన్న ఆయన, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని, దీన్ని ఎలా అంగీకరిస్తామని ప్రశ్నించిన ఆయన, అందువల్లే చంద్రబాబును టార్గెట్ చేస్తున్నామని తెలిపారు. సైబరాబాద్ ను కట్టిన మొగోడినని చెప్పుకునే ఆయన, గత ఐదేళ్లలో అమరావతిని ఎందుకు నిర్మించలేకపోయారని అడిగారు.

 హైదరాబాద్ లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్ తిరిగారని, అప్పుడు ఏం జరిగిందో అందరమూ చూశామని అన్నారు. హైదరాబాద్ తనకు లోకల్ అని చెప్పిన లోకేశ్ కూడా, ఏపీకి వెళ్లిపోయి మంత్రి పదవి తీసుకున్నారని ఆరోపించారు. టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ లో ఉంటే, ఇక్కడ ఆయన పార్టీ ఎలా ఉంటుందని అడిగారు. తెలంగాణలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఓ తోలుబొమ్మలా చేసి ముందు పెట్టి ఆడిస్తున్నందునే ఈ ఎన్నికల్లో చంద్రబాబును టార్గెట్ చేసుకున్నామని మీడియా ప్రతినిధులతో కేటీఆర్ వ్యాఖ్యానించారు.

More Telugu News