titli: మంచి మనసును చాటుకున్న సంపూర్ణేష్ బాబు.. తిత్లి తుపాను బాధితులకు తన వంతు సాయం!

  • ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 వేల విరాళం
  • బాధితులను ఆదుకోవడానికి అందరూ ముందుకు రావాలని విన్నపం
  • శ్రీకాకుళం జిల్లా చాలా నష్టపోయిందని స్నేహితుల ద్వారా తెలుసుకున్నానన్న సంపూ

కష్టాల్లో ఉన్న సాటివారిని ఆదుకోవడంలో సీనీ నటుడు సంపూర్ణేష్ బాబు ఎప్పుడూ ముందుంటారు. ఎలాంటి వైపరీత్యం చోటు చేసుకున్నా తన వంతు సాయంగా తోడ్పాటును అందిస్తుంటారు. తాజాగా తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాను అల్లకల్లోలం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తుపాను బాధితులను ఆదుకునేందుకు సంపూర్ణేష్ బాబు ముందుకు వచ్చారు. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 వేలు అందజేస్తున్నట్టు ప్రకటించారు.

'తిత్లి తుపాను వల్ల శ్రీకాకుళం జిల్లా చాలా నష్టపోయిందని స్నేహితుల ద్వారా తెలుసుకున్నా. నా వంతుగా రూ. 50 వేలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నా. మన వంతు సాయంగా చర్యలు చేపట్టాలని అన్ని వర్గాల ప్రజలను కోరుకుంటున్నా' అంటూ ట్విట్టర్ ద్వారా విన్నవించారు. తుపాను బాధితులను ఆదుకోవడానికి సినీ రంగం నుంచి ముందుకు వచ్చిన తొలి వ్యక్తి సంపూర్ణేష్ బాబే కావడం గమనార్హం. ఈ సందర్భంగా తుపాను బీభత్సాన్ని తెలిపే కొన్ని ఫొటోలను కూడా ఆయన అప్ లోడ్ చేశారు.

More Telugu News