Pawan Kalyan: నన్ను చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు!: పవన్ కల్యాణ్ ఆవేదన

  • నన్ను రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారు
  • బీజేపీకి నేనెప్పుడూ సపోర్ట్ చేయలేదు
  • అమరావతిలో మీడియాతో మాట్లాడిన పవన్

గతంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాలను చిత్తశుద్ధితో నిర్వహించలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. 2014లో తిరుపతిలో జరిగిన సభలో ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీ ఎన్నికల తర్వాత ప్రత్యేక ప్యాకేజీగా మారిపోయిందని విమర్శించారు. తనను కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకున్నారనీ.. ఓ రాజకీయ పార్టీగా పరిగణించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పూటపూటకు మాట మారిస్తే రాజకీయ చిత్తశుద్ధి ఎక్కడి నుంచి వస్తుందని పవన్ ప్రశ్నించారు. ఈ రోజు అమరావతిలో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీని తాను ఎప్పుడూ వెనకేసుకురాలేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఉమ్మడి నిజనిర్ధారణ కమిటీ(జేఎఫ్ఎఫ్ సీ)లో తనతో పాటు మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్, లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ, పద్మనాభయ్య, కృష్ణారావులు కూడా సభ్యులుగా ఉన్నారని గుర్తుచేశారు.

ఆంధ్రప్రదేశ్ కు రూ.70,000 కోట్ల మేర నిధులు ఇంకా రావాల్సి ఉన్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. ప్రత్యేక హోదా అంటూ తాను ముందుకు పోతుంటే, ప్రత్యేక ప్యాకేజీ అంటూ చంద్రబాబు వెనక్కు లాగుతున్నారని పవన్ విమర్శించారు. ఈ విషయంలో మాట్లాడాల్సింది తెలుగుదేశం, వైసీపీ నేతలేనని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం, హక్కుల కోసం జనసేన చివరివరకూ పోరాడుతుందని స్పష్టం చేశారు.

More Telugu News