women: శబరిమలలో అడుగుపెట్టే మహిళలపై మలయాళ నటుడి వివాదాస్పద వ్యాఖ్యలు

  • నటుడు కొల్లాం తులసి సంచలన వ్యాఖ్యలు
  • ముఖ్యమంత్రి చెవులు బద్దలయ్యేలా అయ్యప్ప కీర్తనలు పఠించాలని పిలుపు
  • సర్వత్ర విమర్శలు

మలయాళ నటుడు కొల్లాం తులసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొల్లాంలో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లైతో కలిసి హాజరైన ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శబరిమల ఆలయంలోకి అడుగుపెట్టే మహిళలను రెండుగా చీల్చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెవులు పగిలేలా అయ్యప్ప కీర్తనలు పఠించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.  

2016 అసెంబ్లీ ఎన్నికల నుంచి కొల్లం తులసి బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఎన్డీయే, భారత్ ధర్మ జనసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సేవ్ శబరిమల’కు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

‘‘మీ తల్లులు కూడా శబరిమల వెళ్లాలి. గుడిలోకి వెళ్లేందుకు వచ్చే మహిళలను పట్టుకుని రెండు ముక్కలు చేయాలి. ఒకదానిని ఢిల్లీకి విసిరేసి, మరోదానిని ముఖ్యమంత్రి రూములో పడేయాలి. నాకు తెలుసు మీరెవరూ శబరిమల వెళ్లరు. ఎందుకంటే మీరంతా చదువుకున్నవారు, సున్నిత మనస్కులు. అయ్యప్ప తన పని చేయడం ప్రారంభించారు. దేవాదాయ మంత్రి మనసు త్వరలోనే మారుతుంది’’ అని సదరు నటుడు పేర్కొన్నారు.

కొల్లాం తులసి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ప్రతిపక్షాలు, మహిళ సంఘాల నేతలు ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారు. నెటిజన్లు అయితే, విరుచుకుపడుతున్నారు.

More Telugu News