NTR: ఎన్టీఆర్ సినిమాకు వెళ్లి అదృశ్యమైన విద్యార్థుల ఆచూకీ దొరికింది!

  • స్కూలుకు డుమ్మా కొట్టి సినిమాకు
  • ప్రిన్సిపాల్ మందలించడంతో మనస్తాపం
  • ఆచూకీ కనుగొన్న పోలీసులు

ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ సినిమాకు వెళ్లి, ప్రిన్సిపాల్ మందలించడంతో అదృశ్యమైన ఆరుగురు విద్యార్థుల ఆచూకీ లభ్యమైంది. వీరందరూ తిరుపతిలోనే ఉన్నట్టు గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. స్థానిక రైల్వే కాలనీకి చెందిన వినయ్ కుమార్, పూజిత్ నాయక్, వంశీ, వినయ్, బాలాజీ, ప్రశాంత్‌లు ఓ ప్రైవేటు స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నారు. శుక్రవారం వీరు స్కూలు ఎగ్గొట్టి ‘అరవింద సమేత’ సినిమాకు వెళ్లారు.

స్కూలుకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను ప్రిన్సిపాల్ సుధాకర్ మందలించారు. తల్లిదండ్రులను తీసుకొస్తేనే స్కూల్లోకి అనుమతిస్తామని చెప్పారు. వెనక్కి వెళ్లిన వారి ఆచూకీ ఆ తర్వాత కనిపించకుండా పోయింది. స్కూలు ముగిసినా తమ పిల్లలు ఇంటికి రాకపోవడం, వారి ఆచూకీ తెలియకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు స్కూలు వద్ద ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్ సుధాకర్ ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. శుక్రవారం బాగా పొద్దుపోయాక వీరి ఆచూకీ లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వీరు ఈస్ట్ పోలీసుల అదుపులో ఉన్నారు.

More Telugu News