Jagga Reddy: ఈ గడ్డపై జగ్గారెడ్డికి స్థానం లేదు.. కచ్చితంగా ఓడిస్తాం: హరీశ్ రావు

  • పదవుల కోసమే అనైతిక పొత్తులు
  • పది స్ధానాలూ గెలిచి కేసీఆర్‌కు బహుమతిగా ఇస్తా
  • జగ్గారెడ్డి తెలంగాణ ద్రోహి

ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని పదికి పది స్థానాలు గెలిచి కేసీఆర్‌కు బహుమతిగా ఇస్తామని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సంగారెడ్డి అసమ్మతి నేత సత్యనారాయణతో సమావేశమైన హరీశ్‌రావు ఆయనను బుజ్జగించారు. అందరూ కలిసి పనిచేసి పార్టీ గెలుపునకు కృషిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా సదాశివపేట, కొండాపూర్‌ మండలాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలకు గులాబీ కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డిని కచ్చితంగా ఓడిస్తామన్నారు. ఈ గడ్డపై జగ్గారెడ్డికి స్థానం లేదన్నారు.

తమ పార్టీలో ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా వాటిని సవరించుకుని సంగారెడ్డిపై గులాబీ జెండాను ఎగురవేస్తామని చెప్పారు. పదవుల కోసం విపక్షాలు అనైతిక పొత్తులకు పాల్పడుతున్నాయని దుయ్యబట్టారు. అభివృద్ధి కావాలనుకునే వారంతా టీఆర్ఎస్ వైపు చూస్తున్నారన్నారు. రాజకీయ భవిష్యత్తు, పదవులు కావాలనే లక్ష్యంగా అనైతిక పొత్తులకు కాంగ్రెస్‌ పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రస్తుత ఎన్నికలు అభివృద్ధికి, అవకాశవాద రాజకీయాలకు మధ్య జరుగుతున్నాయని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.

More Telugu News