vijayashanthi: కుప్పకూలిన సభా వేదిక.. విజయశాంతికి తప్పిన ప్రమాదం

  • అచ్చంపేటలో నిర్వహించిన ప్రచార సభలో సంఘటన
  • విజయశాంతి అభివాదం చేస్తుండగా కుప్పకూలిన స్టేజ్
  • వెంటనే అప్రమత్తమైన మహిళా కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతికి ప్రమాదం తప్పింది. మహబూబ్ నగర్ జిల్లాలోని అచ్చంపేటలో ఈరోజు నిర్వహించిన ప్రచార సభలో ఈ సంఘటన జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజయశాంతి అభివాదం చేస్తున్న సమయంలో సభా వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది.

విజయశాంతికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కార్యకర్తలు అధిక సంఖ్యలో అక్కడికి వచ్చిన సమయంలో ఈ సంఘటన జరిగింది. వెంటనే, అప్రమత్తమైన మహిళా కాంగ్రెస్ నేతలు ఆమెను పైకి లేపారు. ఈ ఘటన జరిగిన సమయంలో కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, నంది ఎల్లయ్య తదితర నాయకులు స్టేజ్ పై కూర్చుని ఉన్నారు. ఈ సంఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. వేదిక ఏర్పాట్లు సరిగా లేకపోవడంతోనే స్టేజ్ కుప్పకూలినట్టు సమాచారం.

 కాగా, కొల్లాపూర్ బహిరంగ సభ ముగించుకుని అచ్చంపేట సభకు కాంగ్రెస్ నేతలు హాజరైన సమయంలో ఈ సంఘటన జరిగింది. ప్రమాద సంఘటన అనంతరం ప్రచార రథంపై నుంచి కాంగ్రెస్ నాయకులు నిలబడి కార్యకర్తలకు అభివాదం చేశారు. ఆ తర్వాత, హెలికాప్టర్ లో నాయకులు వెళ్లిపోయారు. 

More Telugu News