Telangana: తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు శుభవార్త.. ఇంటర్వ్యూల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

  • 267 మంది అభ్యర్థులను తప్పించిన ధర్మాసనం
  • వైట్ నర్ వాడటం, డబుల్ బబ్లింగే కారణం
  • ఇంటర్వ్యూలు నిర్వహించాలని ఆదేశం

తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష రాసిన నిరుద్యోగులకు హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్-2 పరీక్షల్లో అర్హత సాధించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్ పీఎస్సీ)ను ఆదేశించింది. ఈ పరీక్షల్లో భాగంగా వైట్ నర్ వాడిన, రెండు సార్లు బబ్లింగ్ చేసిన 267 మంది అభ్యర్థులను తుది జాబితా నుంచి తొలగించింది. వైట్ నర్ తో పాటు డబుల్ బబ్లింగ్ చేసిన అభ్యర్థులను తప్పించాలంటూ దాఖలైన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం.. సానకూలంగా తీర్పు ఇచ్చింది. గ్రూప్-2 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు పిలవాలని చెప్పింది.

2016, నవంబర్ లో 1,032 గ్రూప్-2 ఉద్యోగాలకు టీఎస్ పీఎస్సీ రాతపరీక్షను నిర్వహించింది. దాదాపు 5.65 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. అయితే వైట్ నర్ వాడకం, డబుల్ బబ్లింగ్ చేసిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను విచారించిన ధర్మాసనం... తాజాగా అలాంటి అభ్యర్థులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

More Telugu News