padminireddy: పద్మినీరెడ్డికి ఏం ఇబ్బంది కలిగిందో తెలియదు!: టీ-బీజేపీ నేత కిషన్ రెడ్డి

  • పద్మినీరెడ్డి మా పార్టీ సానుభూతిపరురాలు
  • ఈ సంఘటన పార్టీపై ప్రభావం చూపబోదు
  • కేసీఆర్ కుటుంబానికి ప్రజలు తగిన శాస్తి చేయాలి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీరెడ్డి నిన్న బీజేపీలో చేరిన కొన్ని గంటలకే తిరిగి కాంగ్రెస్ లోనే కొసాగుతానని ఆమె ప్రకటించడం తెలిసిందే. ఈ విషయమై టీ-బీజేపీ అగ్రనేత కిషన్ రెడ్డి మాట్లాడుతూ, పద్మినీరెడ్డి తమ పార్టీ సానుభూతిపరురాలని, బీజేపీలో చేరాలని వచ్చిన ఆమెను స్వాగతించామని చెప్పారు.

మరి, ఆమెకు ఏం ఇబ్బంది కలిగిందో తెలియదు కానీ, మనసు మార్చుకున్న ఆమె తిరిగి కాంగ్రెస్ లోనే కొనసాగుతానని చెప్పారని అన్నారు. ఈ సంఘటన తమ పార్టీపై ఎటువంటి ప్రభావం చూపబోదని అన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రత్యేక తెలంగాణ వద్దన్న ఎంఐఎం పార్టీని భుజాన వేసుకున్న టీఆర్ఎస్ కు ప్రజలు తగినబుద్ధి చెబుతారని అన్నారు. వచ్చే ఎన్నికలలో కేసీఆర్ కుటుంబానికి ప్రజలు తగిన శాస్తి చేయాలని కోరారు.

More Telugu News