old man murder: నడిరోడ్డుపై డెబ్బయి ఐదేళ్ల వృద్ధుడి దారుణ హత్య.. వీడియో ఇదిగో!

  • మసీదుకు వెళ్లి వస్తుండగా పట్టపగలే ఘాతుకం
  • కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపిన దుండగుడు
  • తమిళనాడులోని కోయంబత్తూరులో ఘోరం

మసీదులో ప్రార్థనలు చేసుకునేందుకు ఇంటి నుంచి వెళ్తున్న డెబ్బయి ఐదేళ్ల వృద్ధుడిని ఓ దుండగుడు నడిరోడ్డుపై  హత్య చేశాడు.  తమిళనాడులోని కోయంబత్తూరులో గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో జమీల్‌ అహ్మద్‌ (75) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి ఇంటికి కూతవేటు దూరంలో పట్టపగలే ఈ దారుణం చోటుచేసుకోవడం గమనార్హం.

నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధుడి వెనుక నుంచి వచ్చిన దుండగుడు తొలుత జమీల్‌ అహ్మద్‌ను పట్టుకుని రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లోకి పడదోశాడు. అహ్మద్‌ తేరుకుని దుండగుడిని అడ్డుకునే లోపునే అతన్ని కత్తితో విచక్షణా రహితంగా పొడిచాడు. దాడి సందర్భంగా అహ్మద్‌ ఒకటి రెండు సార్లు పైకి లేచి అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ దుండగుడు వదలలేదు.

తీవ్ర గాయాలు కావడంతో ఘటనా స్థలిలోనే జమీల్‌ అహ్మద్‌ కుప్పకూలిపోయాడు. ఈ ఘోరం సమీపంలోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అయ్యింది. ‘కోయంబత్తూరుకు చెందిన జమీల్‌ అహ్మద్‌, రిజ్వాన్‌ మధ్య ఆస్తి తగాదాలు కొనసాగుతున్నాయి. ఇవే ఈ హత్యకు కారణం' అని పోలీసులు నిర్థారించారు. రిజ్వాన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News