Sri Lanka: హనీమూన్‌కు వెళ్లి తాగిన మత్తులో హోటల్‌ను కొనేసిన కొత్త దంపతులు!

  • శ్రీలంకలో హోటల్‌ను కొనేసిన కొత్త జంట
  • తాగిన మత్తులో కొన్నా ఆనందంగా ఉందన్న దంపతులు
  • తాజాగా వెల్లడించి ఆశ్చర్యపరిచిన వైనం

హనీమూన్‌ కోసం శ్రీలంక వెళ్లిన కొత్త జంట తాగిన మత్తులో తాము బస చేసిన హోటల్‌నే కొనేసింది. లండన్‌కు చెందిన గినా లేయాన్స్ (33), మార్క్ లీ (35) గతేడాది జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. మూడు వారాల హనీమూన్ కోసం శ్రీలంక ఫ్లైటెక్కి ద్వీప దేశంలో వాలిపోయారు. సముద్ర తీరంలో ఉన్న ఓ హోటల్‌లో దిగారు. అక్కడి వాతావరణం, హోటల్ సిబ్బంది మర్యాదలు వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.

హోటల్‌లో ఓ రోజు కొత్త దంపతులు రమ్ తాగుతుండగా.. హోటల్ బార్ టెండర్ ఒకరు వారితో చనువుగా మాట్లాడుతూ హోటల్ లీజ్ దగ్గర పడుతోందని వారికి చెప్పుకొచ్చాడు. అప్పటికే పూర్తిగా మద్యం మత్తులోకి జారుకున్న కొత్త దంపతులు హోటల్‌ను తామే లీజుకు తీసుకుంటామని, ఆ 30 వేల పౌండ్ల(రూ.30 లక్షలు) ను తామే కడతామని నోరు జారారు. అప్పటికే 12 గ్లాసుల రమ్‌ను కడపులో పోసుకున్న వారు హోటల్‌ను తీసుకోవాలని కమిట్ అయిపోయారు. ఆ తర్వాత ఇచ్చిన మాటకు కట్టుబడి హోటల్‌ను లీజుకు తీసుకుని దానికి యజమానులుగా మారిపోయారు.

జూన్‌లో హనీమూన్ కోసం వెళ్లిన గినా దంపతులు ఈ ఏడాది జూలై 1 నాటికి ఓ హోటల్‌కు యజమానులుగా మారిపోయారు. తాము కొన్న హోటల్‌ పేరును మార్చేసి ‘లక్కీ బీచ్ టాంగలే’గా నామకరణం చేశారు. మూడేళ్ల లీజుకు హోటల్‌ను తీసుకున్నామని, 2019తో గడువు ముగుస్తుందని గినా తెలిపారు. తాజాగా ఈ విషయాన్ని వారు వెల్లడించారు. హనీమూన్‌కు వెళ్లి హోటల్‌ను కొనుగోలు చేసి యజమానులుగా మారడం ఆనందంగా ఉందని గినా-మార్క్‌లీ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.

More Telugu News