Sisters: దొంగ కిలేడీలు... ఈ అక్కా చెల్లెళ్ల టార్గెట్ కేవలం రైళ్లు మాత్రమే!

  • రైళ్లలో వరుస దొంగతనాలు చేస్తున్న సిస్టర్స్
  • మల్కాజిగిరి స్టేషన్ లో అనుమానాస్పదంగా సంచరిస్తుంటే చూసిన పోలీసులు
  • ప్రశ్నించగా, దొంగతనాల విషయం బట్టబయలు

వాళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లు. వారి లక్ష్యం కేవలం రైలు ప్రయాణికులే. రైలు ఎక్కే హడావుడిలో ఉన్న వారిని ఫాలో అయి, వారి నుంచి బంగారు ఆభరణాలను తస్కరించడమే వారి వృత్తి. రైళ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వీరిద్దరిపైనా అనుమానం వచ్చిన మల్కాజిగిరి పోలీసులు, అదుపులోకి తీసుకుని విచారించగా, మొత్తం విషయం బయటకు వచ్చింది.

మహారాష్ట్రలోని నాందేడ్‌ కు చెందిన తాహెరబేగం అలియాస్‌ సమీనా బేగం (40), షేక్‌ సల్మా బేగం అలియాస్‌ జకియా బేగం (35)లు గత కొంతకాలంగా, రైళ్లలో ప్రయాణిస్తూ ప్రయాణికుల నగదు, నగలు చోరీ చేస్తున్నారు. వీరిపై జీఆర్‌పీ పోలీస్‌ స్టేషన్‌ లో ఐదు కేసులు నమోదయ్యాయి. గతంలో వీరు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. రెండు రోజుల క్రితం మల్కాజిగిరి రైల్వేస్టేషన్‌ బయట అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు ప్రశ్నించగా, తాము దొంగతనాలు చేస్తున్నట్టు అంగీకరించారు. వీరి నుంచి నల్లపూసల గొలుసు స్వాధీనం చేసుకున్నామని, రిమాండ్ కు తరలించామని తెలిపారు.

More Telugu News