ys jagan: ఇంకా, సిగ్గు లేకుండా పాస్ పోర్ట్ ల సీజ్ గురించి మాట్లాడుతున్నారా?: బుద్దా వెంకన్న

  • మీ పాస్ పోర్టులు గతంలో సీజ్ అయ్యాయిగా
  • ఆ విషయం గురించి ప్రస్తావించండి
  • విజయసాయిరెడ్డికి ఘాటుగా కౌంటరిచ్చిన బుద్దా

చంద్రబాబు, లోకేశ్ ల పాస్ పోర్ట్ లు సీజ్ చేయాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా తప్పని, ఈ విషయమై ప్రజాసంకల్ప యాత్రలో జగన్ ని ప్రజలు నిలదీయాలని కోరారు.నాలుగున్నరేళ్లు జగన్, విజయసాయిరెడ్డి పాస్ పోర్ట్ లు సీజ్ అయ్యాయన్న విషయాన్ని ప్రస్తావించాలని అన్నారు.

కనీసం, సిగ్గు కూడా పడకుండా, పాస్ పోర్ట్ ల గురించి ప్రస్తావిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు గురించి గజదొంగలు మాట్లాడటం దౌర్భాగ్యమని, 2019లో వైసీపీ మూటాముల్లె సర్దుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల తర్వాత ఈ గజదొంగలు విదేశాలకు పారిపోవాలనుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు, లోకేశ్ లు రాష్ట్ర సంక్షేమం కోసమే తాపత్రయపడతారు తప్ప, ముడుపుల కోసం, మూటల కోసం తాపత్రయపడరని అన్నారు.

జగన్, విజయసాయిరెడ్డి లాగా జైలు జీవితం కావాలని ఎవరూ కోరుకోరని.. జైలు జీవితమంటే వాళ్లిద్దరికీ ఆటలాగా అయిపోయిందని, ఆ జీవితం వాళ్లకు హ్యాపీగా ఉందని సెటైర్లు వేశారు.  

More Telugu News