congress: మహిళా సంఘాలకు రూ.10 లక్షల రుణం.. లక్ష గ్రాంటు: ఉత్తమ్

  • మహిళల బతుకులు బాగుపడితేనే సమాజ అభివృద్ది
  • మోదీ పాలనలో వంటగ్యాస్ రూ.970కి చేరింది
  • డిసెంబర్ 12న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా మహిళా సంఘాలకు రూ.లక్ష చొప్పున గ్రాంటు అందజేస్తామని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. ప్రతి మహిళా సంఘానికి రూ.10 లక్షల చొప్పున రుణం అందచేస్తామని.. దానిపై వడ్డీ భారం ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. షాపూర్‌నగర్‌లో నిర్వహించిన ‘కాంగ్రెస్‌ మహిళా గర్జన’ సభలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. మోదీ పరిపాలనలో వంటగ్యాస్‌ రూ.970కి చేరిందని.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చుక్కలనంటుతున్నాయని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా నిత్యావసర వస్తువులు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని‌ హామీ ఇచ్చారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, బీడీ కార్మికులకు నెలకు రూ.2 వేలు, దివ్యాంగులకు రూ.3వేల చొప్పున పింఛన్‌ ఇస్తామని ఉత్తమ్ ప్రకటించారు.

మహిళల బతుకులు బాగుపడితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్‌ పార్టీ నమ్ముతోందన్నారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్న కుటుంబ సభ్యుల్లోని ప్రతి మనిషికి నెలకు ఏడు కిలోల సన్నబియ్యంతో పాటు ఉప్పు, పప్పు, చక్కెర సహా 9 రకాల వస్తువులు, ఏడాదికి 6 వంటగ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందిస్తామన్నారు. డిసెంబర్‌ 12న కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఉత్తమ్‌ ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News