Prakasam District: పిల్లలకు విషమిచ్చి, తాను కూడా తాగి.. ఓ తల్లి ఆత్మహత్యాయత్నం!

  • తొమ్మిదేళ్ల కుమార్తె మృతి
  • తల్లీకొడుకుల పరిస్థితి విషమం
  • కుటుంబ కలహాలే కారణమన్న అభిప్రాయం

అందమైన జీవితాన్ని ఊహించుకున్న ఆమె కల నిజం కాలేదు. పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా అనిపించింది. ఈ పరిస్థితుల్లో చనిపోవడమే ఉత్తమమన్న నిర్ణయంతో ఓ వివాహిత పిల్లలతో పురుగుల మందు తాగించి తానూ తాగేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన వీరిలో కుమార్తె చనిపోగా, తల్లీకొడుకుల పరిస్థితి విషమంగా ఉంది.

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేర్నమిట్టలో జరిగిన ఈ విషాదకర ఘటనకు సంబంధించి వివరాలు ఇలా వున్నాయి. గ్రామానికి చెందిన మాధవీలతకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. గత కొంతకాలంగా కుటుంబ కలహాలతో మాధవీలత ఇబ్బంది పడుతోంది. పరిస్థితి చక్కబడుతుందని ఓర్పుగా ఎదురు చూసినా జరగలేదు.

పిల్లలు పెద్దవారవుతున్న నేపథ్యంలో భయపెడుతున్న ఇంటి పరిస్థితులు చూసి ఆమె ఆందోళన చెందింది. దీంతో పిల్లలతో సహా ఆత్మహత్యా యత్నం చేసింది. ఈ ఘటనలో ఆమె తొమ్మిదేళ్ల కూతురు విజయలక్ష్మి చనిపోయింది. తల్లీ కొడుకులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News