robbery: కొత్తగూడెంలో దోపిడీ దొంగల బీభత్సం.. సాయిబాబా గుడిలో దారుణహత్య!

  • హుండీలో సొమ్మును దోచుకెళ్లిన దొంగలు
  • అడ్డుగా వచ్చిన వాచ్ మెన్ కిరాతక హత్య
  • గాలింపు ప్రారంభించిన పోలీసులు

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. కొత్తగూడెం పట్టణంలోని సాయిబాబా గుడిలో దోపిడీకి పాల్పడ్డారు. అడ్డుగా వచ్చిన వాచ్ మెన్ ను అత్యంత కిరాతకంగా హత్యచేసి సొమ్ముతో పరారయ్యారు. నిన్న అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్తగూడెం పట్టణంలోని ప్యూన్ బస్తీకి చెందిన చల్లా వెంకటరెడ్డి(70) ఫైర్ స్టేషన్ ఎదురుగా గల సాయిబాబా గుడిలో వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో నిన్న కొందరు దుండగులు రాత్రిపూట గోడను దూకి ఆలయంలోకి ప్రవేశించారు. దీంతో గుడిలో నిద్రిస్తున్న వెంకటరెడ్డి వారిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో రెచ్చిపోయిన దొంగలు ఓ రాడ్డుతో అతని తలపై మోదారు. అనంతరం విచక్షణారహితంగా దాడి చేయడంతో వెంకటరెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక గుడిలోని హుండీలను పగులగొట్టి నగదును దోచుకుపోయారు. ఈ రోజు ఉదయం ఆలయానికి చేరుకున్న పూజారి దీన్ని గమనించి విషయాన్నిపోలీసులుకు తెలిపారు.

దీంతో జిల్లా ఎస్పీ సునీల్ దత్, డీఎస్పీ అలీ తమ సిబ్బందితో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం అక్కడి పరిస్థితులను పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ని రంగంలోకి దింపారు. గుడిలోని సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలింపును ప్రారంభించామనీ, త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ సునీత్ దత్ తెలిపారు.

More Telugu News