Warangal: రైలు ప్రయాణికుడిని కొట్టి రూ.14.34 లక్షలు అపహరణ.. వరంగల్ రైల్వే స్టేషన్‌లో ఘటన!

  • వరంగల్ రైల్వే స్టేషన్‌లో భారీ దోపిడీ
  • సార్ పిలుస్తున్నారంటూ రైలు నుంచి దింపి దాడి
  • నగదు ఉన్న సొమ్ముతో పరారీ

తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలులో చెన్నై వెళ్తున్న ఓ ప్రయాణికుడిపై దాడి చేసి రూ.14.34 లక్షల నగదును దోచుకున్న ఘటన వరంగల్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌కు చెందిన సురేశ్ దాలియా అనే వ్యాపారి చెన్నై నుంచి బంగారు ఆభరణాలు తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తుంటాడు. శుక్రవారం రాత్రి తన వద్ద పనిచేసే గుమస్తా బేతి యుగంధర్‌కు రూ.14.34 లక్షలు నగదు ఇచ్చి చెన్నై వెళ్లి నగల తయారీదారులకు ఇచ్చి రమ్మని పంపాడు.

ఆ డబ్బులు పట్టుకుని వరంగల్ రైల్వే స్టేషన్ చేరుకున్న యుగంధర్ తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాడు. రైలు కదలడానికి సిద్ధమవుతున్న సమయంలో యుగంధర్ వద్దకు వచ్చిన ఓ వ్యక్తి సార్ రమ్మంటున్నాడని బలవంతంగా అతడిని కిందికి దించాడు. అప్పటికే అక్కడ కాపు కాసిన మరో నలుగురు వ్యక్తులు అతడిపై దాడిచేసి చేతిలోని సంచిని లాక్కుని పారిపోయారు. దీంతో లబోదిబోమన్న బాధితుడు వెంటనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రైల్వే స్టేషన్‌లోని సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.

More Telugu News