Cricket: విండిస్ ను చావుదెబ్బ తీసిన కుల్దీప్.. ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం!

  • రాజ్ కోట్ టెస్టులో బౌలర్ల అద్భుత ప్రదర్శన
  • ఐదు వికెట్లు పడగొట్టిన కుల్దీప్ యాదవ్
  • పావెల్ ఒంటరి పోరాటం వృథా 

రాజ్ కోట్ లో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ పై భారత జట్టు ఇన్నింగ్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత స్పిన్నర్లు కుల్దీప్ ఐదు వికెట్లతో విండిస్ పతనాన్ని శాసించాడు. అతనికి తోడుగా జడేజా మూడు, అశ్విన్ రెండు వికెట్లు తీసుకోవడంతో ఫాలో ఆన్ ఇన్నింగ్స్ లో విండిస్ జట్టు 196 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో విజయదుందుభి మోగించింది.

విండిస్ ఆటగాళ్లలో ఒక్క పావెల్ మాత్రమే 83 పరుగుల(93 బంతుల్లో, 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) తో భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. అతనికి సహచర ఆటగాళ్లు ఎవ్వరూ తగిన సహకారం అందించకపోవడంతో విండిస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది. వికెట్లు కోల్పోతున్న నేపథ్యంలో స్కోర్ బోర్డు పెంచేందుకు యత్నించిన పావెల్ భారీ షాట్ కు యత్నించి కుల్దీప్ యాదవ్ కు దొరికిపోయాడు.

 భారత్ తొలి ఇన్నింగ్స్ ను 649 పరుగులకు డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన విండిస్ తొలి ఇన్నింగ్స్ లో 181 పరుగులకు ఆలౌట్ అయిపోయింది. దీంతో ఫాలో ఆన్ ప్రారంభించిన విండిస్ మరో 190 పరుగులకే చాప చుట్టేసింది. రెండో ఇన్నింగ్స్ లో విండిస్ జట్టు కేవలం 51 ఓవర్లు మాత్రమే ఆడటం గమనార్హం.

More Telugu News