Telangana: ప్రియురాలి కోసం కత్తులు దూసుకున్న ప్రియులు.. ఒకరి మృతి!

  • తాను ప్రేమిస్తున్న అమ్మాయి చెయ్యి పట్టుకున్నాడని రగిలి పోయిన ప్రియుడు
  • ఇద్దరూ గ్రూపులుగా విడిపోయి తరచూ గొడవలు
  • రాజీ పేరుతో కలిసిన సందర్భంలో  దారుణం

ప్రేమించిన అమ్మాయి తనకే దక్కాలన్న స్వార్థంతో ఇద్దరు స్నేహితులు శత్రువులుగా మారిన వైనంలో చివరికి ఒకరు హత్యకు గురయ్యారు. సినిమా కథను తలపించే ఈ ఘటన హైదరాబాద్‌ నగరంలోని ఏక్‌మీనార్‌ చౌరస్తాలో ఇటీవల చోటు చేసుకుంది. సైఫాబాద్‌ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి కథనం మేరకు...ఫస్ట్‌లాన్సర్‌లో నివాసం ఉండే షాహీదుద్దీన్‌ (23), అజారుద్దీన్‌ అలియాస్‌ అజ్జూ (27)  స్నేహితులు. వీరిపై స్టేషన్‌లో పలు కేసులున్నాయి.

వీరిద్దరూ ఒకే అమ్మాయిపై మనసుపడి వెంటపడుతుండే వారు. ఓ రోజు షాహీదుద్దీన్‌ అ అమ్మాయి చెయ్యి పట్టుకోవడం చూసి అజారుద్దీన్‌ తట్టుకోలేకపోయాడు. ఇద్దరూ గొడవ పడ్డారు. ఆ తర్వాత రెండు గ్రూపులుగా విడిపోయారు. తరచూ తారసపడుతుండేవారు. తాను ప్రేమిస్తున్న అమ్మాయిని టీజ్‌ చేస్తున్న షాహీదుద్దీన్‌ను చంపేయాలని అజారుద్దీన్ నిర్ణయానికి వచ్చాడు.

ఇందుకోసం తన అనుచరులైన మహ్మద్‌ అబ్దుల్లా, మహ్మద్‌ సలాం, మహ్మద్‌ అబ్దుల్‌ జునైద్‌ సహకారం కోరాడు. సెప్టెంబరు 30న హత్య చేయాలని నిర్ణయించారు. రాజీ చేసుకుందాం రావాలని షాహీదుద్దీన్‌కు ఫోన్‌ చేసి ఆహ్వానించారు. ఎందుకైనా మంచిదని షాహీదుద్దీన్‌ ఓ కత్తితో అక్కడికి వచ్చాడు. నాంపల్లి ఏక్‌మినార్‌ మసీదు సమీపంలోని ఓ భవనం సెల్లార్‌లో షాహీదుద్దీన్‌, అజారుద్దీన్‌, అతని అనుచరులు కూర్చుని తెల్లవారు జాము వరకు మద్యం, గంజాయి మత్తులో మునిగి తేలారు.

ఆ సమయంలో మళ్లీ అమ్మాయి ప్రస్తావన రావడంతో షాహీదుద్దీన్‌ కత్తితీసి అజారుద్దీన్‌ను చంపుతానని బెదిరించాడు. దీంతో అజారుద్దీన్‌తో పాటు అతని అనుచరులు ముగ్గురూ కలిసి షాహీదుద్దీన్‌పై దాడిచేశారు. కత్తితో ఇష్టానుసారం పొడవడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.

More Telugu News