sexual harrasment: ప్రియురాలిని వేధించిన అధ్యాపకుడు.. తుపాకీతో క్లాస్ లోనే కాల్చిచంపిన ప్రియుడు!

  • యువతిని వేధిస్తున్న కోచింగ్ ఫ్యాకల్టీ
  • ప్రియుడికి గోడును చెప్పుకున్న యువతి
  • కోచింగ్ సెంటర్ లోనే హత్యచేసిన యువకుడు

తన ప్రియురాలిని ఓ అధ్యాపకుడు వేధించడాన్ని యువకుడు తట్టుకోలేకపోయాడు. పక్కా ప్రణాళికతో తుపాకీతో అత్యంత కిరాతకంగా కాల్చిచంపాడు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. ఈ ఘటన సాక్షాత్తూ దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

ఉత్తరప్రదేశ్ లోని భాగ్ పత్ పట్టణానికి చెందిన కశ్యప్ ఢిల్లీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. కశ్యప్ ప్రియురాలు కూడా ఢిల్లీలోనే ఉంటూ కోచింగ్ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో కోచింగ్ క్లాస్ లు చెప్పే కుమార్ అనే టీచర్ తనను ప్రేమించాలని యువతిని ఒత్తిడి చేసేవాడు. తనతో మాట్లాడాలనీ, పార్టీలకు రావాలని ఇబ్బంది పెట్టేవాడు. లేదంటే ప్రాణాలు తీసుకుంటానని బెదిరించేవాడు. వీటన్నింటినీ ఓపికగా భరించిన యువతి చివరికి వేధింపులు హద్దులు దాటడంతో అసలు విషయాన్ని ప్రియుడు కశ్యప్ కు చెప్పింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన కశ్యప్ అతనిని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు.

తొలుత రూ.2 వేలతో ఓ దేశీ నాటు తుపాకీని కొన్నాడు. మాస్క్ వేసుకుని కోచింగ్ సెంటర్ కు వెళ్లి మరీ కుమార్ ను తుపాకీతో కాల్చిచంపాడు. ఆ తర్వాత ఘటనాస్థలి నుంచి పరారయ్యాడు. ఈ నేపథ్యంలో కోచింగ్ సెంటర్ యాజమాన్యం సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి కశ్యప్ ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తానే ఈ హత్య చేసినట్లు అంగీకరించడంతో నిందితుడిని కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించారు.

More Telugu News