tanusree dutta: తనుశ్రీ దత్తా లైంగిక వేధింపుల ఘటనపై స్పందించిన అనుష్కా శర్మ!

  • పోరాటాన్ని కొనసాగించాలని సూచన
  • నిజాలు చెప్పేందుకు ధైర్యం కావాలని వ్యాఖ్య
  • ఇప్పటికే పలువురు సెలబ్రిటీల మద్దతు

బాలీవుడ్ సినిమా ‘హార్న్ ఓకే ప్లీజ్’ షూటింగ్ సందర్భంగా సీనియర్ నటుడు నానా పటేకర్, కొరియోగ్రఫర్ గణేశ్ ఆచార్య తనను లైంగికంగా వేధించారని హీరోయిన్ తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. అలాగే దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి దుస్తులు విప్పి డ్యాన్స్ చేయాల్సిందిగా వేధించారని చెప్పి బాంబు పేల్చింది. ఈ నేపథ్యంలో ఆమెకు నానా పటేకర్ తో పాటు వివేక్ అగ్నిహోత్రి లీగల్ నోటీసులు పంపారు. ఈ వ్యవహారంలో సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, ట్వింకిల్ ఖన్నా, ఫర్హాన్ అక్తర్ సహా పలువురు సెలబ్రిటీలు తనుశ్రీకి మద్దతుగా నిలిచారు. తాజాగా ఈ వివాదంపై హీరోయిన్, క్రికెటర్ విరాట్ కోహ్లి భార్య అనుష్కా శర్మ స్పందించింది.

తనుశ్రీ తన పోరాటాన్ని ధైర్యంగా కొనసాగించాలని చెప్పింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బయటకు వచ్చి చెప్పడానికి చాలా ధైర్యం కావాలని వ్యాఖ్యానించింది. ‘మీరు ఏ వృత్తిలో ఉన్నా మీ విధులు నిర్వర్తించేటప్పుడు భయపడకూడదు. మీరు ఎవరిని ఎదుర్కొంటున్నారో, ఎదుటివారు ఎంత శక్తిమంతమైనవారో తెలిసినప్పుడు ముందుకొచ్చి నిజాలను వెల్లడించడానికి చాలా ధైర్యం కావాలి. అది లేకపోవడం వల్లే చాలామంది ఇంకా ముందుకు రావడం లేదు’ అని అనుష్కా శర్మ వ్యాఖ్యానించింది.

More Telugu News