KCR: కేసీఆర్ ఆరోజు చేసింది దొంగ దీక్ష.. ఇంజెక్షన్ తో ప్రత్యేక మందును ఎక్కించుకున్నాడు!: కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి

  • ప్రత్యేక తెలంగాణకు సోనియాను నేనే ఒప్పించా
  • నన్ను విమర్శించే అర్హత కేసీఆర్ కు లేదు
  • తెలంగాణ ద్రోహులే ఇప్పుడు కేసీఆర్ తో ఉన్నారు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందిగా అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని తానే ఒప్పించానని ఆ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి తెలిపారు. అలాంటి తనను విమర్శించే నైతిక అర్హత కేసీఆర్ కు లేదని జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహి అనీ, ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో దొంగ దీక్షలు చేశారని ఆరోపించారు. తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించిన వారినే ఇప్పుడు కేసీఆర్ చంకలో పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.

2009లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆరోగ్యం క్షీణించినట్లు దొంగ నాటకాలు ఆడారని విమర్శించారు. అప్పుడు కేసీఆర్ కు 750 కేలరీల శక్తి ఉన్న ప్రత్యేకమైన మందును రోజూ ఇంజెక్షన్ ద్వారా ఇచ్చారనీ, అందుకే అన్ని రోజుల పాటు దీక్ష చేయగలిగారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం పేరిట కేసీఆర్ అప్పట్లో దొంగ దీక్షలకు దిగి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల తర్వాత కేసీఆర్ బీజేపీతో జతకడతారని జైపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో ఈ సందర్భంగా జైపాల్‌ రెడ్డి సమక్షంలో 2,000 మంది ప్రజలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

More Telugu News