Jana Sena: ఇంకా ఎలా పోరాడాలి.. ఏమేం చేయాలి?: జనసేన పార్టీ 'అంతర్మథనం' నేడే

  • పవన్ కల్యాణ్ అధ్యక్షతన  సమావేశం
  • పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చ
  • జనసైనికుల కవాతుకు బాలారిష్టాలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ వ్యవస్థాగత నిర్మాణంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఈ రోజు విజయవాడలో పార్టీ అంతర్మథన సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే నేతలు.. ఇప్పటివరకూ అనుసరించిన విధానాలు, చేపట్టాల్సిన మార్పులు తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.

జనసేన ఇప్పటికే ప్రతి జిల్లాలో దాదాపు ఇద్దరు సమన్వయకర్తలను నియమించింది. ఇక విశాఖలో అయితే ఐదుగురు ఉన్నారు. అయితే ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాల్లో పవన్ సమన్వయకర్తల నియామకం జోలికి పోలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేడర్ ను సమన్వయం చేసేందుకు వీలుగా జనసేన రాష్ట్రస్థాయి కేడర్ ను సైతం నియమించింది.  తాజా భేటీలో మిగిలిన జిల్లాల కేడర్  నియామకంపై పవన్ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.

అలాగే అభిమానులు, యువత సాయంతో పార్టీని బలోపేతం చేయడంపై పవన్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. మరోవైపు జనసేన ఈ నెల 9న పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం వరకూ రోడ్డు రైలు వంతెనపై  ‘జనసైనికుల కవాతు’ నిర్వహించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. కవాతుకు అనుమతులు తీసుకోవడం, సమయం సరిపోదనే అభిప్రాయంతో దీన్ని వాయిదా వేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

More Telugu News