Andhra Pradesh: యూపీ సీఎంను ఇరుకున పెట్టబోయి ఆంధ్రప్రదేశ్ అంబులెన్స్‌లను పోస్టు చేసిన కాంగ్రెస్ నేత!

  • అఖిలేశ్ యాదవ్ హయాంలో అంబులెన్స్ సర్వీసులు
  • ప్రస్తుతం మూలన పడేసిన వైనం
  • యూపీకి బదులు ఏపీ అంబులెన్స్‌లను పోస్టు చేసిన దిగ్విజయ్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని భావించిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ దిగ్విజయ్ సింగ్ తప్పులో కాలేశారు. మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ప్రవేశపెట్టిన 102, 108 అంబులెన్స్‌లను యూపీ ప్రభుత్వం పక్కన పెట్టేసిందని, అవి తుప్పుపట్టి పాడైపోతున్నాయని ఆరోపించారు.

 అంబులెన్స్‌లు పనిచేయకపోవడంతో రోగులు ఎడ్ల బండ్లపై ఆసుపత్రికి రావాల్సిన దుస్థితి నెలకొందని దుమ్మెత్తి పోస్తూ మూలన పడి ఉన్న అంబులెన్స్‌ల ఫొటోలను ట్వీట్ చేశారు. ఇది సిగ్గుచేటని ధ్వజమెత్తారు. అయితే, అంతవరకు బాగానే ఉన్నా ఆయన పోస్టు చేసిన అంబులెన్స్‌లు ఆంధ్రప్రదేశ్‌వి కావడంతో బీజేపీ నేతలకు స్వయంగా అస్త్రం ఇచ్చినట్టు అయింది. ఆరోపణలు చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలంటూ బీజేపీ నేతలు దిగ్విజయ్‌పై విరుచుకుపడుతున్నారు.

More Telugu News