Narendra Modi: బీజేపీకి షాక్.. కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రచారం చేయనున్న మోదీని పోలిన వ్యక్తి!

  • అచ్చం మోదీని పోలి ఉండే అభినందన్ పాఠక్
  • గత ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం
  • వచ్చే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం

నరేంద్రమోదీకి వీరాభిమాని, అచ్చం ఆయనలా పోలి ఉండే అభినందన్ పాఠక్ బీజేపీకి షాకిచ్చారు. గత ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేసిన ఆయన ఇప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌కు చెందిన ఆయన ఈ ఏడాది మార్చిలో జరిగిన గోరఖ్‌పూర్ ఉప ఎన్నికల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు ప్రభుత్వ తీరుతో మనస్తాపం చెంది కాంగ్రెస్‌లో చేరి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించనున్నట్టు చెప్పారు.

ప్రధాని నరేంద్రమోదీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, ప్రస్తుత పాలన తాను అనుకున్నదానికి విరుద్ధంగా ఉందని పాఠక్ ఆవేదన వ్యక్తం చేశారు. తానెక్కడికి వెళ్లినా ‘అచ్చే దిన్ కబ్ ఆయేంగే’ (మంచి రోజులు ఎప్పుడొస్తాయ్) అని అడుగుతున్నారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం చేసి చాలా పెద్ద పొరపాటు చేశానని, ఈసారి మాత్రం ఆ తప్పు చేయబోనని, బీజేపీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తానని తేల్చి చెప్పారు.

తాను ఇప్పటికే ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్‌బబ్బర్‌ను కలిశానని, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీతో సమావేశం ఏర్పాటు చేస్తానని ఆయన మాటిచ్చారని పాఠక్ చెప్పారు. ఇప్పుడు తాను కాంగ్రెస్‌తో పనిచేయాలని నిర్ణయించుకున్నానన్నారు.

More Telugu News